జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండల పరిధిలో అమానుష ఘటన వెలుగు చూసింది. పొనగండ్ల గ్రామంలో ఎనిమిదేళ్ల పసిపాపపై ఇద్దరు మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 9మహాప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండల పరిధిలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఎనిమిదేళ్ల పసిపాపపై ఇద్దరు మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఘటన వివరాలిలా..
ఓ గ్రామానికి చెందిన బాధితురాలు (8) ఘటన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న ఇద్దరు యువకులు, చిన్నారిని బలవంతంగా ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నారి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారిని కుటుంబ సభ్యులు.. భూపాలపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చిన్నారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
పోలీసుల చర్యలు..
సమాచారం అందుకున్న వెంటనే రేగొండ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులపై ఫోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు అదే గ్రామానికి చెందిన వారా లేక బయటి నుంచి వచ్చారా.. అనే కోణంలో విచారణ సాగుతోంది. చిన్నారిపై జరిగిన ఈ అఘాయిత్యంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పసిపాపపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మృగాళ్లను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితులకు ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం వేగంగా స్పందించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.