ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పాత చేగొండపల్లి గ్రామం వద్ద ఆవుపై పులి దాడి చేసి చంపేసింది.
ఏలూరు జిల్లా ఏప్రిల్ 18 (మహాప్రభ) : పోలవరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రాజెక్ట్ సమీపంలోని పాత చేగొండపల్లి గ్రామం వద్ద ఒక ఆవుపై పులి దాడి చేసి చంపిన ఘటన స్థానికంగా భయాందోళనకు దారితీసింది.
ఆవు మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పరిశీలించగా, అక్కడ పులి పాదముద్రలను గుర్తించారు. ఈ నేపథ్యంలో పులి కదలికలను పర్యవేక్షించేందుకు అటవీశాఖ సిబ్బంది ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి ఏ దిశగా సంచరిస్తోందో తెలుసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పులి సంచారం కారణంగా గ్రామస్తులు, అలాగే పోలవరం ప్రాజెక్ట్ కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో బయటకు రావద్దని, పశువులను సురక్షితంగా ఉంచాలని అటవీశాఖ అధికారులు సూచించారు. అలాగే పరిస్థితిని నిశితంగా గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.