mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 12:24 pm Digital Edition : Namastey Mahaaprabha

ఆర్సీబీ కోచ్‌పై బీసీసీఐ సీరియస్.. ఎందుకంటే?

బెంగళూరు జట్టు హెడ్‌ కోచ్‌ ఆండీ ఫ్లవర్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఐపీఎల్‌ 2026లో భాగంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.

స్పోర్ట్స్ డెస్క్ మే 11 ( మహాప్రభ ) : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌పై బీసీసీఐ సీరియస్ అయ్యింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడిపై చర్యలకు దిగింది. మ్యాచ్ సమయంలో ఫోర్త్ అంపైర్‌తో వాదనకు దిగడం, అసభ్యకరంగా మాట్లాడినందుకు ఫ్లవర్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆదివారం ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. ముంబై విధించిన 166 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ గట్టిగా పోరాడాల్సి వచ్చింది. ప్రతి పరుగు, ప్రతి బౌండరీ ఆర్సీబీ జట్టుకు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో 17.2వ ఓవర్‌లో ఆర్సీబీ బ్యాటర్ కొట్టిన ఓ బౌండరీని నిరాకరిస్తూ మూడో అంపైర్ వివాదాస్పద నిర్ణయం తీసుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. దినేష్ కార్తిక్, ఆర్సీబీ హెడ్ కోచ్ ఫ్లవర్ ఫోర్త్ అంపైర్ వద్దకు వెళ్లి ఆ నిర్ణయం తప్పు అని వాదించారు. వారి మధ్య వాగ్వాదం జరిగినప్పుడు ఫ్లవర్ హద్దులు దాటాడని ఐపీఎల్ నిర్వహణ కమిటి నిర్ధారించింది. కానీ, కార్తిక్‌కు మాత్రం శిక్ష పడలేదు.

‘ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మ్యాచ్ సమయంలో అసభ్య పదజాలంతో మాట్లాడటం ఆర్టికల్ 2.3ను ఉల్లంఘించారని తేలింది. 17.2వ ఓవర్‌లో ఆండీ ఫోర్త్ అంపైర్‌తో దూకుడుగా మాట్లాడినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆండీ ఫ్లవర్‌ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవెల్ 1ను ఉల్లంఘించాడు. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించాము’ అని ఐపీఎల్ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఫ్లవర్ తన తప్పును అంగీకరించి, మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ విధించిన శిక్షను స్వీకరించాడు. లెవెల్ 1 ఉల్లంఘనల కింద కోచ్‌లపై కూడా చర్యలు తీసుకునే అధికారం మ్యాచ్ రిఫరీకి ఉంటుంది. ఐపీఎల్‌లో ఇలాంటి ఉదంతాలు చాలా అరుదుగా జరిగాయి. గత సీజన్‌లో గుజరాత్‌ కోచ్‌ ఆశిష్ నెహ్రాకు కూడా ఇలాగే జరిమానా పడింది.